16, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఓంకార్

ఇది ఎప్పుడో ఓంకార్ గారి పుస్తకంలో చదివిన కథ.

వయస్సు తొంభైలలో ఉండి చావడానికి సిద్ధంగా ఉన్న ఒక కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త, తాను తెలుగుదేశం పార్టీలోకి మారుతున్నట్లు ప్రకటించడం ఆ ఊర్లో అక్కడినుండి పాకి ఏకంగా రాష్ట్రంలోనే చర్చనీయాంశం అయ్యింది. రేపోమాపో చనిపోయే ముసలతనికి ఇంకా ఆ పార్టీల గొడవెందుకూ! ముసలివాడికి మతి భ్రమించిందని కాంగ్రెస్ పార్టీవాళ్ళు రుసరుసలాడారు. ముసలాడికి చివరి నిముషంలో అయినా బుద్ధి సరిగా పనిచేసి తమ పార్టీలొనికి రానున్నాడని అనుకొని పసుపు చొక్కాల ఛాతీలు పొంగాయి. ఈ సంఘటనకి సాధ్యమైనంత ప్రచారం కల్పించి లబ్ధిపొందాలని పసుపు తమ్ముళ్ళు ఆ పార్టీలో ముసలతను చేరే రోజుని భారీగా రాష్ట్రస్థాయి నాయకుల సమక్షంలో జరిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తీరా ఆ రోజు రానే వచ్చింది. ముసలతను పార్టీ మారటమూ జరిగింది. అన్ని పత్రికలు మరియు టివి వాళ్ళ సమక్షంలో అసలు ఈ వయసులో ఇలా పార్టీ మారే ఆలోచన ఎందుకు చేశారని అడిగితే, తాను కాంగ్రెస్ పార్టీలో ఉండగా చనిపోతే ఒక కాంగ్రెసోడు చనిపోయాడని అందరూ అనుకుంటారనీ, అది తనకు ఇష్టంలేదనీ, అందుకనే చనిపోయే ముందు పసుపు పార్టీలో చేరాననీ ముసలతను చెప్పగానే కార్యక్రమానికి వచ్చిన కొన్ని పెద్ద పసుపు చొక్కాలు స్పృహ కోల్పోయి కార్యక్రమం అంతా రసాభాస అవుతుంది.

అసలు ఇటువంటి సంఘటన ఎక్కడైనా నిజంగా జరిగే ఉంటుందా అని అనిపించేది. మరీ ముదిమి వయసులో కూడా ఇలా పార్టీలు, భావజాలాలు అంటూ ద్వేషించుకోవటం... కానీ మన కరడుగట్టిన కమ్యూనిస్టు వృద్ధులను చూసినతరువాత జ్ఞానోదయం ఐపోతుందనుకోండి. అది వేరే విషయం.

మన దేశంలో జాతీయవాదులపై,  టెర్రరిస్టులూ మరియు దేశ ద్రోహులపై ఉన్నంత సానుభూతి ఉండదు. హిందువులూ మరియూ మైనార్టీల విషయంలో కూడా అంతే. టెర్రరిస్టులకు సంఘీభావం తెలుపుతాం. సైనికులని తూలనాడతాం. చర్చిపై రాళ్ళు విసిరితే అంతర్జాతీయ వార్త. గుడుల్లో దశాబ్దాల తరబడి జరుగుతున్న విగ్రహ చోరీ మరియు నిధుల త్రవ్వకాలు పెద్ద విషయం కాదు. మైనార్టీల మనోభావాలకున్నంత విలువ హిందువుల మనోభావాలకు లేదు. కాబట్టి ఇక నుండి ఎవరినైనా శిక్షంచాలనుకొనేటప్పుడు ప్రభుత్వం ముందుగా వాళ్ళకి హిందూత్వ లేదా జాతీయవాద ముద్ర వేసేస్తే ఎవరి మనో భావాలూ దెబ్బ తినవనుకుంటా. ఇప్పుడు ఉదాహరణకి హర్యాణాలో ఎవరో బిషప్ మీద అత్యాచార ఆరోపణలు వచ్చి రెండు నెలలు దాటినా ఇంకా పోలీసులూ అరెస్టు చెయ్యలేదంట. అదే హిందూ స్వామీజీ ఐతే పరిస్థితి వేరే విధంగా ఉండేది కదా. కాబట్టి ఆ బిషప్ ఒక కరడు గట్టిన హిందూత్వ వాది. మైనార్టీలకు చెడ్డపేరు తేవడానికి అలా బిషప్ గా మారి ఆ విధంగా చేశాడు అని చెప్పి మూసేస్తే ఇటు మైనార్టీల మనోభావాలు భంగపడవు. హిందువులకు ఎలాగూ అలవాటైపోయింది కాబట్టి ఇది పెద్ద విషయంకాదు.

ఏంటీ? ప్రతీది మరీ అసంబద్ధంగా గోరంతను కొండంతదిలా చేసి చూస్తున్నానా? ఉండండి, నేనుకూడా లౌకిక కళ్ళద్దాలు పెట్టేసుకుంటా....

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

'ఆలస్యం అమృతం విషం'

సినిమా పేరు గుర్తులేదు కానీ ఒక తెలుగు సినిమాలో, పట్టభద్రులై కళాశాలలో ప్రధమ స్థానంకోసం పోటీ పడే ఇద్దరు యువకులను వాళ్ళకు స్పూర్తినిచ్చే మాటలను చెప్పమంటారు. అప్పుడు మొదటి యువకుడు "నిదానమే ప్రధానం" అని చెబితే రెండవ యువకుడు "ఆలస్యం అమృతం విషం" అని చెబుతాడు.

ఆలస్యం మరియు నిదానం ఒకటేనా? ఏమో!

'ఆలస్యం అమృతం విషం' అని అంటుంటారు కదా. ఏదైనా పని చేసేటప్పుడు మనం ఆచరించవలసిన వ్యూహానికి సంబంధించినదీ సామెత. అలాగే తొందరపాటు కూడా సమయాన్ని బట్టి అమృతం లేదా విషం అవుతుంటుంది. ఆలస్యం అమృతం విషం అన్న విషయంలో సందేహం లేనప్పటికీ అది ఎప్పుడు అమృతమవుతుంది లేదా ఎప్పుడు విషమవుతుంది అన్న విషయం మాత్రం ఎప్పటికీ అంతుచిక్కదుకదా!

దీని గురించి మహాభారతం శాంతి పర్వంలో ఒక కథ ఉంటుంది. ఒక పని ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో తెలుసుకొనేది ఎలా తాతా అని ధర్మరాజు అడిగితే భీష్ముడు చిరకారి అనే వాడి కథ చెబుతాడు.

చిరకారి అనేవాడు గౌతమ మహర్షి కొడుకు. ప్రతి పనినీ చేసేముందు పరిపరి విధాల ఆలోచించి ఆ పనిని చేసేవాడు కావున చిరకారి అని పిలిచేవారన్నమాట. అలాగే మందబుద్ధి అని కూడా పిలిచేవారట తనని.  ఒక సారి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యపై కోపం చేత ఆమెను చంపివేయమని చిరకారికి ఆజ్ఞాపించి అడవికి వెళ్ళిపోతాడు. ఇక అప్పటినుండి మొదలౌతుంది చిరకారిలో అంతర్మథనం. ఒక వైపు పితృవాక్య పరిపాలన, మరొకవైపు మాతృహత్యా పాతకం. ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రుల యొక్క గొప్పదనముల గురించి పరిపరి విధముల ఆలోచిస్తుంటాడు. అమ్మంటే ఎవరు? నన్ను కడుపులో పెట్టుకు పెంచేది కావున ధాత్రి అనీ జన్మనిచ్చినది కావున జనని అనీ, అవయవపుష్ఠి కలిగించింది కావున అంబ అనీ, బాల్యంలో శుశ్రూష చేయటం చేత శ్వశ్రువనీ.....ఇలా సాగుతుంది చిరకారి చింతన.

ఈలోగా తన తొందరపాటును తెలుసుకున్న గౌతమ మహర్షి చిరకారి అహల్యను చంపివేశాడేమోనని కంగారుపడుతూ దుఃఖంతో ఇంటిముఖం పడతాడు. ఇంటివద్ద అహల్య సజీవంగానే ఉండటం చూసి మహదానందపడి చిరకారిని కౌగిలించుకుని చిరకాలం జీవించమని ఆశీర్వదిస్తాడు.

ఈ విధంగా ఏ పనైనా సరే తగినంత ఆలోచించి చేయటంవల్ల కీర్తి లభిస్తుందని కథని ముగిస్తారు భీష్మాచార్యులు.

ఈ కథలో గౌతమ మహర్షి తొందరపాటును చిరకారి చేసిన ఆలస్యం నిర్వీర్యం చేసిందికదా. ఐతే ప్రతిసారి కూడా ఆలోచించేంత సమయం ఉంటుందా? ఒక వేళ తగినంత సమయం ఉన్నా మనం సరైన నిర్ణయం చేయగలమన్న నమ్మకం ఏమిటి? అందుకేనేమో, చిరకాలం వృద్ధులనాశ్రయించమని చెప్పారు పెద్దలు. ఇంతకీ వృద్ధులంటే ఎవరు? బుద్ధి చేత వృద్ధులు గానీ వయసుచేత కాదంట వృద్ధులు. నిజమేననుకుంటా. అందరికీ మేలు చేకూర్చేదే ధర్మమంట.  ఏ పని చేసినా ఎక్కువ మందికి మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంటే ధర్మాచరణ చేసినట్టన్నమాట. అప్పుడు నిదానం ప్రధానమవ్వచ్చు. ఆలస్యం అమృతమవ్వచ్చు.

3, సెప్టెంబర్ 2018, సోమవారం

స్వధర్మము

ఒక గొర్రెల మందపై దాడి చేయబోయిన కడుపుతో ఉన్న సింహం సింహం పిల్లను ప్రసవించి చనిపోతుంది. అప్పటినుంచి ఆ సింహం పిల్ల గొర్రెల మందలోనే సాకబడి పెరిగి పెద్దవుతుందన్నమాట. కాకపోతే పాపం ఆ సింహం తాను కూడా గొర్రెనే అని భ్రమిస్తూ గొర్రెల వలె ప్రవర్తిస్తుండేది. ఒక సారి వేరొక సింహం ఆ గొర్రెల మందపై దాడి చేయగా ఆ గొర్రెలతో పాటు వాటితో పెరిగిన సింహం కూడా భయపడి పారిపోవటం ప్రారంభిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన దాడి చేసిన సింహం ఒకింత ఆశ్చర్యానికి లోనవుతుంది. అది నెమ్మదిగా మందలోని సింహాన్ని చేరి అది కూడా తనలాంటి సింహమేననీ, ఎందుకు అలా భయపడుతోంది అనీ అడుగుతుంది. అప్పుడు ఆ మందలోని సింహం తాను సింహం కాదనీ గొర్రెననీ ఉద్ఘాటిస్తుంది. గొర్రెలా అరుస్తుంది. అప్పుడు ఆ దాడి చేసిన సింహం మందలోని సింహాన్ని ఒక కొలను దగ్గరకి తీసుకుపోయి అక్కడ నీటిలో తమ ఇద్దరి ప్రతిబింబాలు చూపిస్తుంది. తామిద్దరూ ఒకేలా ఉండటం గమనించిన మందలోని సింహం తాను కూడా సింహాన్నే అన్న విషయం గ్రహించి ఒక్కసారిగా ఊపిరి తీసుకొని గట్టిగా గర్జిస్తుంది. సింహంలా బ్రతకటం మొదలుపెడుతుంది.

ఇది మనందరికీ తెలిసిన కథే!
మన దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ చిన్నచూపు చూసే మందలో సింహాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. కృష్ణాష్ఠమి, దీపావళి, హోళి, దసరా, విగ్రహారాధన, బహుళ దేవతారాధన, జ్యోతిష్యం, పురాణాలు, ఇతిహాసాలు, ఆచారాలూ అలవాట్లూ వీటన్నిటినీ ఏదో ఒక విజాతీయ గొర్రె మంద చెప్పిందని చెప్పి వాటిని విస్మరిస్తూ తమ సొంత అస్తిత్వాన్ని మరిచిపోయిన భారతీయ సింహాలు  దేశానికి అజాగళస్తనాలవలె దాపురించారు.
నువ్వు గొర్రెవి అని చెప్పే సాహిత్యానికున్న ప్రచారమూ వనరులూ మన మూల సాహిత్యానికి ఉండటం లేదు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులలో కొంచెం మార్పు కనిపిస్తుండటం ముదావహము.

"బాగుగా ఆచరించబడిన పరధర్మముకంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్ఠమైనది. స్వభావమును అనుసరించి కర్మలననుసరించు మనుష్యునకు ఎట్టి పాపములునూ ఏమాత్రము అంటనే అంటవు." - శ్రీకృష్ణ ఉవాచ, భగవద్గీత