23, ఆగస్టు 2018, గురువారం

రెండు కథలు

రెండు కథలు. (ఇవన్నీ మా పాఠ్యాంశాలలోనివే)

1. అనగనగా ఒక కప్పల రాజ్యం ఉండేది. ఒక సారి ఆ రాజ్యంలోకి ఒక ముసలి పాము వస్తుంది. దాంతో ఆ కప్పలలో భయం మొదలవుతుంది. ఈ సంగతేంటో తేలుద్దామనుకున్న కప్పల రాజుతో తాను ముసలి పాముననీ, వేటాడలేననీ కావాలంటే రోజూ రాజుగారిని తన వీపుపై మోస్తానని, పాముపై ఊరేగే కప్పగా తనకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలొస్తాయనీ ఆశ పెడుతుంది. ఆ ప్రతిపాదనకు సరే అన్న కప్పల రాజు రోజూ పాముపై ఊరేగటం మొదలు పెడతాడు. కానీ ఒక రోజు పాము కదలక మొరాయిస్తుంది. ఎందుకనడిగిన కప్పల రాజుతో తాను ఏమీ తినక నీరసించాననీ కనీసం ఒక కప్పనైనా తింటే తప్ప కదలలేననీ బదులిస్తుంది. ఐతే పాముపై ఊరేగటానికి అలవాటు పడ్డ కప్పల రాజు సరే తినమని పాముకి అనుమతి ఇస్తాడు. ఇక  అప్పటి నుంచి అది నిత్య కృత్యమైపోతుంది. కప్పలను బాగా తిని తెగ బలిసిన పాము ఒకానొక శుభముహూర్తాన ఆ కప్పల రాజుని కూడా ఆరగించేస్తుంది. ఆ విధంగా మొత్తం కప్పలన్నింటినీ ఫలహారం చేసిన పాము మరొక కొత్త రాజ్యాన్ని వెతుక్కుంటూ పోయింది.

2. అనగనగా ఒక ఎలుకల రాజ్యం ఉండేదన్నమాట. ఎలుకలకి వారి రాజంటే అత్యంత భక్తి ప్రపత్తులన్నమాట. అయితే ఇలా ఆనందంగా సాగిపోతున్న ఎలుకల రాజ్యంలోనికి ఒక బక్కచిక్కిన ముసలి పిల్లి వస్తుంది. దాన్ని చూడగానే ఎలుకలన్నీ చాలా భయపడిపోతాయి. అప్పుడు ఆ ఎలుకల రాజు ఆ పిల్లి అంతు తేలుద్దామని దానిదగ్గరకు పోగా, తాను సాధారణమైన పిల్లిని కాననీ, గొప్ప మహిమలు గలదాన్ననీ, శాకాహారం మాత్రమే తీసుకుంటాననీ, కావున ఎలుకలన్నీ ప్రతిరోజూ వరుసలో వచ్చి దీవెనలందుకుంటే మేలు జరుగుతుందనీ నమ్మబలుకుతుంది. ఆ మాటలను నమ్మిన ఎలుకరాజు రోజూ తన ఎలుకలన్నింటినీ పిల్లి వద్ద దీవెనలకోసం పంపేవాడు. కొన్ని రోజులకి ఎలుకల సంఖ్య తగ్గటం ఆరంభమయ్యింది. పిల్లిని చూస్తే రోజురోజుకీ బలుస్తోంది. ఇంతకీ జరుగుతున్నదేమిటంటే ప్రతి రోజూ వరుసలో ఆఖరి ఎలుకని పిల్లి గుటుక్కున మింగేసేది. అయితే ఈ సంగతి తెలియని రాజు అసలు ఏమవుతుందో గమనిద్దామని ఒక రోజు వరుసలో ఆఖరున ఉంటాడు. తన వంతు రాగానే తనని తినేందుకు నోరు తెరచిన పిల్లిని చూసి విషయం అర్థమయ్యి వెంటనే తన ఖడ్గంతో ఆ పిల్లి తలని నరికేస్తాడన్నమాట.

ఈ రెండు కథల్లోని రాజులను ఈ రోజుల్లో లౌకికవాదులు అని పిలుస్తున్నారంట. మొదటి కథ మన దేశంలో ప్రస్తుతం జరుగుతుంది. రెండవ కథ లాంటి ముగింపు వచ్చే సూచనలు ఉన్నాయో లేదో వచ్చే సంవత్సరం తెలిసిపోతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి